హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కేసు సంబంధం ఉన్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్కు తాఖీదులు ఇచ్చింది. బుధవారం ఇద్దరు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది.
ఈ కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్ కనిపించకపోవడంతో సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జగ్గుస్వామికి సైతం ఎల్ఓసీ జారీచేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి తుషార్, జగ్గుస్వామితో సంబంధాలున్నట్టు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో తుషార్, జగ్గుస్వామిలను విచారణకు పిలిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిద్దరు కనిపించడం లేదన్న సమాచారంతో సిట్ బృందంలోని ఏసీపీ లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వారు దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు ఈ నోటీసులు పంపారు.