టేకుమట్ల, మే 22: జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి, బండపల్లి, కుందనపల్లి, పెద్దంపల్లి పంట పొలాల్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎండ వేడితోపాటు బలంగా గాలులు వీచడం తో మంటలు వ్యాపించాయి. 15 క్విం టాళ్ల మక్కలు, 15 మామిడి చెట్లు కాలిపోగా, వివిధ రైతుల మోటర్ వైర్లు, పైపులు కాలిపోయాయి. పెద్దంపల్లి శివారులో జరిగిన అగ్నిప్రమాదంలో బస్తాల్లో ఎత్తిన 60 క్వింటాళ్ల మక్కలు, 2 ఎకరాల వరి పొలం, 20 వడ్ల బస్తాలు, మోటర్ వైర్లు, పైపులు కాలి పోయాయని బాధిత రైతు దాసరి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదచారి ఆయా గ్రామస్తుల నుంచి ప్రమాద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, సింగరేణి జీఎంలతో ఫోన్లో మాట్లాడి మంటల గురించి వివరించి, ఫైరింజన్లు పంపించాలని కోరారు. అదే విధంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఓ రైతు తన పంట అవశేషాలను కాల్చేందుకు శుక్రవారం నిప్పంటించాడు. ఎండల తీవ్రతతో పాటు వడగాలులకు సుమారు 5వందల ఎకరాల వరకు మంట వ్యాపించాయి. డ్రిప్ పైపులు, కరెంట్ మోటర్లు, స్టాటర్లు, కేబుల్ వైర్లు, పంటలకు నీరందించే పైపులు, బోరు మోటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.