హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ విభాగాల్లో 1,433 ఇంజినీర్లు సహా సాంకేతిక పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ మంగళవారం జీవోలు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయా పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఇంజినీర్ పోస్టులే అధికంగా ఉన్నాయి. వీటితోపాటు నీటి పారుదలశాఖ, ఆర్అండ్బీ, టీఎస్ఈడబ్ల్యూసీడీ తదితర విభాగాల్లోని పోస్టులను కూడా కలిపి ఉమ్మడి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఆయా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలపగానే ఇండెంట్లు సేకరించి నోటిఫికేషన్ జారీచేయాలని యోచిస్తున్నారు. అయితే పరీక్షలు మాత్రం విభాగాలవారీగా ఉంటాయని అధికారులు తెలిపారు.
నోటిఫికేషన్లు ఇలా..
అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లోని సివిల్ పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీచేస్తారు. వీరికి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఫలితాలను ప్రకటించి విభాగాలవారీగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఎలక్ట్రికల్, మెకానికల్ పోస్టులన్నింటి పైన చెప్పుకొన్న ఫార్ములానే పాటిస్తారు.