గోపాల్పేట/వనపర్తి, సెప్టెంబర్ 10: తెలంగాణలో కిరాయి మనుషులతో వైఎస్ షర్మిల అహంకార యాత్ర చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో మనుషులను తీసుకొచ్చి పూలు చల్లించుకొంటూ యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని, ఒక్కమాటకు వంద మాటలు బల్లెంలా దూసుకొస్తాయని హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్తగా మంజూరైన 1,331 ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు మంత్రి శనివారం పంపిణీ చేశారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర వైఎస్ఆర్ కుటుంబానిదని విరుచుకుపడ్డారు. వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే తాను న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టినట్టు స్పష్టంచేశారు.
‘నువ్వు రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలి’ అని షర్మిలకు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు పారుతుందని వెల్లడించారు. పొల్కెపహాడ్కు సాగునీరు అందడంతో ఒక్క యాసంగిలోనే రూ.20 కోట్ల పంట పండిందని ఉద్ఘాటించారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేని దేశంలోని కొన్ని దుష్టశక్తుల కండ్లు మండుతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో ఎవరైనా చస్తే తప్ప పింఛన్ వచ్చేది కాదని.. నేడు అర్హులందరికీ పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది అని చెప్పారు.