హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికలను హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 27న నిర్వహించనున్నట్టు డిప్యూటీ లేబర్ కమిషనర్ మంగళవారం ప్రకటించారు. సింగరేణి యాజమాన్యంతోపాటు 13 కార్మిక సంఘాల వాదనను సమర్థించిన ధర్మాసనం.. ఎన్నికలను వాయిదా వేస్తూ తీర్పుచెప్పింది. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘానికి ఎన్నికలు వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పనుల్లో తలమునకలయ్యారని, గతంలో ఆదేశించిన మేరకు అక్టోబర్ నాటికి ఎన్నికలను నిర్వహించడం కష్టమని యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ఆమోదించింది. ఈ ఏడాది డిసెంబర్ 27న సింగరేణి కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీలోగా కార్మికశాఖకు తుది ఎన్నికల జాబితాను సమర్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
తాజా ఓటర్ల జాబితాను అందజేయాలి: హైకోర్టు
కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న సింగరేణి కార్మిక సంఘానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ శాసనసభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని సింగరేణి ఎన్నికల తేదీని డిసెంబర్ 27కి వాయిదా వేస్తున్నట్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. అక్టోబర్లోగా ఎన్నికలను నిర్వహించాలని పేర్కొంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించినట్టు తెలిపింది. ఎన్నికలను నిర్వహించిన రోజునే ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున నామినేషన్ల దాఖలు, ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియ నుంచి తిరిగి కొనసాగించాలని ఆదేశించింది. కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్కు సింగరేణి యాజమాన్యం తాజా ఓటర్ల జాబితాను అందజేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు ఆయనకు సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ పత్రం సమర్పించాలని కోరింది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను పరిరక్షణకు సహకరిస్తామంటూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.