Floating solar | భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక రంగంతోపాటు విద్యుత్ ఉత్పత్తిరంగంలోనూ మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టింది. బొగ్గు పరిశ్రమల్లో ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్న తొలి సంస్థగా చరిత్రకెక్కింది. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్లో దేశంలోనే తొలిసారిగా నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటికే 5 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో మల్లన్నసాగర్లో కూడా మరో ఫ్లోటింగ్ యూనిట్ను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా విద్యుత్ వినియోగం పెరగడంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక ప్రాంతాల్లో సోలార్ పవర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018లో సోలార్ పవర్తో ముందుకు వచ్చిన సింగరేణి ఏడాదికి 700 మిలియన్ యూనిట్ల అవసరాన్ని గుర్తించింది. దీనికి అనుగుణంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందుకుగానూ 1,612.26 కోట్లు ఖర్చవుతున్నది.
సింగరేణి ఏరియాల్లో వివిధ రూపాల్లో వినియోగించే విద్యుత్ వాడకానికి సోలార్ను వినియోగించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసుకొన్నది. తొలిసారిగా ఎస్టీపీఎల్ ద్వారా ఫ్లోటింగ్ సోలార్తో 5 మెగా వాట్ల ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం, మందమర్రి ప్రాంతాల్లో సోలార్ యూనిట్లను నెలకొల్పి, మొత్తంగా 224 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నది.
ఇప్పటికే సరఫరా అవుతున్న విద్యుత్తోపాటు మరో 76 మెగావాట్ల విద్యుదుత్పత్తికి సింగరేణి ఏర్పాట్లు చేస్తున్నది. ఎస్టీపీపీ ద్వారా 10, కొత్తగూడెం గ్రైవడ్ మౌంటెడ్ 33, చెన్నూర్లో 11, రామగుండంలో ఓబీ డంప్ ద్వారా 22 మెగావాట్ల విద్యుదుత్పత్తికి సిద్ధమవుతున్నది. భవిష్యత్లో మరో 8 ఏరియాల్లో కొత్త సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 220 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తగూడెం 35, ఇల్లందు 15, భూపాల్పల్లి 12, శ్రీరాంపూర్ 24, మందమర్రి 57, థర్మల్ పవర్ప్లాంట్ 32, ఆర్జీ-1 4, ఆర్3లో 41 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. ఇప్పటివరకూ సింగరేణి సంస్థ విద్యుత్ను జెన్కో నుంచి కొనుగోలు చేస్తున్నది. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో సింగరేణికి సరిపడా విద్యుత్ను సోలార్ ప్లాంట్ల ద్వారానే సమకూర్చుకోనున్నది. దీంతో ఏటా రూ. 200 కోట్లు సింగరేణి సంస్థకు ఆదాకానున్నది.
సింగరేణిలో తొలిసారిగా ఫ్లోటింగ్ సోలార్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో హైదరాబాద్కు చెందిన నోవాస్ గ్రీన్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా గ్లాస్ టు గ్లాస్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఏర్పాటు చేసింది. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. భవిష్యత్లో రామగుండం ఏరియాలోని డంప్యార్దులో సోలార్ పవర్ యూనిట్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయిలో సోలార్ పవర్ ద్వారానే సింగరేణి సంస్థ పనిచేయనున్నది. దేశంలో తొలిసారిగా ఫ్లోటింగ్ సోలార్ సిస్టం ఏర్పాటు చేయడం సింగరేణికి గర్వకారణం. బొగ్గు పరిశ్రమల్లో ఇప్పటివరకూ ఎక్కడా చేయలేనిది సింగరేణి చేసి చూపించింది. గ్లాస్ టు గ్లాస్ టెక్నాలజీ ద్వారా నీటిపై తేలియాడే సోలార్ పవర్ మన దగ్గరే ఉంది. సోలార్తో ఇప్పటికే సింగరేణి సంస్థకు రూ.200 కోట్లు ఆదా అవుతున్నాయి. మరో రూ.300 కోట్లు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
-జీఎస్ జానకీరాం, జీఎం, సోలార్ ఎనర్జీ