హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఫేజ్-1 ప్లాంట్లకు సింగరేణి బొగ్గు సరఫరా కానున్నది. ఈ మేరకు మంగళవారం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. సింగరేణి సంస్థ ఈడీ (కోల్ మూమెంట్) జే అల్విన్, ఎన్టీపీసీ తెలంగాణ ప్రాంత పర్యవేక్షణాధికారి పాల్ సమక్షంలో సింగరేణి జనరల్ మేనేజర్ (మారెటింగ్) కే సూర్యనారాయణ, ఎన్టీపీసీ జీఎం (ఇంధనం) తపస్ సాహా మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. ఫేజ్-1లోని 800 మెగావాట్ల ప్లాంట్కు సింగరేణి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తుందని సూర్యనారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఫేస్-2లోని రెండు ప్లాంట్లకు (2 X 800) కలిపి 80 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించామని పేర్కొన్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 13 ఎన్టీపీసీ ప్లాంట్లకు సింగరేణి ఏటా 139 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో సింగరేణి డీజీఎం (మారెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, ఎస్వోఎం సురేందర్ రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్రెడ్డి, ఎస్ఈ రవి శ్రీవాస్తవ, ఎన్టీపీసీ ఏజీఎం ఆవిషర్ మెష్రమ్ తదితరులు పాల్గొన్నారు.