హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక అధికారిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల నేపథ్యంలో తక్షణమే జిల్లాకు వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే మరో ఇద్దరు అదనపు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించింది. ఐఏఎస్లు రజత్కుమార్ సైనీ, హనుమంతరావును ప్రత్యేక అధికారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. దాదాపు 36 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులకుపైగా నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం 70.8 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుండగా.. 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. గతంలో రెండుసార్లు మాత్రమే 70 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం. భద్రాచలంలో 36 సంవత్సరాల తర్వాత 70 అడుగుల నీటిమట్టం దాటింది. గోదావరి నీటిమట్టం 75 అడుగులు దాటితే 50 సంవత్సరాల నాటి రికార్డ్ బ్రేక్ కానున్నది.
ఆరుసార్లు 60 అడుగులు దాటి ప్రవహించింది. ఇదిలా ఉండగా.. భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితులపై సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్, ఎస్పీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాత్రి వరకు ఐటీసీ భద్రాచలంలో హెలీకాప్టర్ అందుబాటులో ఉంటుందని, రాత్రికి నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటాయని తెలిపారు. అలాగే బోట్లు, బస్సులు, ట్రక్కులు పంపుతున్నట్లు తెలిపారు.