Singareni | పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి సాధనకు వీలుగా రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తిపై అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 120 రోజుల్లో ప్రతి నిమిషం విలువైనదని.. ఉత్పత్తి లక్ష్య సాధనకు అన్ని ఏరియాలు సమష్టిగా కృషి చేయాలని సీఎండీ సూచించారు.
గనులలో ప్రతి నిమిషం బొగ్గు ఉత్పత్తికి కీలకమైనదని సీఎండీ బలరామ్ అన్నారు. ఆలస్యంగా ఉత్పత్తి కార్యకలాపాలు జరగకుండా ప్రతి గని మేనేజర్, ప్రాజెక్టు అధికారి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 7 గంటల వరకు అందరు అధికారులు గనుల వద్దకు చేరుకుని కార్మికులకు దిశా నిర్దేశం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా 8 గంటల పాటు పనిచేసేలా చూడాలని, క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కంపెనీ యంత్రాల పనితీరును మెరుగుపరచాలని, కనీసం 18 గంటలు వినియోగించేలా చూడాలన్నారు. అదే సమయంలో ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారా సింగరేణి వినియోగదారులను కాపాడుకోగలమని, పోటీ మార్కెట్లో నిలదొక్కుకోగలమని సీఎండీ బలరామ్ తెలిపారు. స్వీయ రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. నూతన ప్రాజెక్టులైన కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లందులోని రోంపేడు ఓసీలో వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. అదే సమయంలో ఒడిశా నైనీ బ్లాక్లో చెట్ల గణన కొంత పూర్తయిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తితో ముడిపడిన ఇతర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.