రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, పలు కార్మిక సంఘాలు, కొన్ని పత్రికలు సిరివెలుగుల సింగరేణిపై దుష్ప్రచారానికి తెగబడ్డాయి. ఏటా కార్మికులకు లాభాల్లో వాటాలు పంచుతున్న సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ అబద్ధాలు వల్లెవేస్తున్నాయి.. ఏటికేడు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న సింగరేణి చీకట్లోకి వెళ్తున్నదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. తప్పుడు ప్రకటనలతో అటు సింగరేణి కార్మికులు, ఇటు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
కొత్తగూడెం సింగరేణి, ఏప్రిల్ 18: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతున్నది. ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించకముందు ఉన్న లాభాలను మూడేండ్ల సగటు తీసుకొని రెండుశాతం చొప్పున సీఎస్ఆర్ నిధులకు మళ్లిస్తున్నారు. ఈ నిధులను 80 శాతం సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. 20 శాతం నిధులను రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా అయినా అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు (డీఎంఎఫ్) నిధులను మైన్స్, మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ (ఎంఎండీఆర్) యాక్టు 1957 ప్రకారం రాయల్టీ పైన 30 శాతం (సుమారు 4.2) నిధుల ను మైన్స్ ఉన్న ఏరియా జిల్లా కలెక్టర్కు అప్పజెప్తునారు. ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ నిధులను ఖర్చు చేస్తున్నా రు. ఇప్పటివరకు సింగరేణి సంస్థ లాభాల్లో అన్ని పన్నులు మినహాయించి నికర లాభాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉన్న విశాఖ ఉక్కును ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ ముందుకు కదిలారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఔత్సాహిక కంపెనీలు ఆర్థికంగా ఆదుకోవాలని లేదా ముడి సరుకు సరఫరా చేసి.. సహాయ సహకారాలు అందించాలని కోరగా.. అక్కడ మనం రాణిస్తామా? లేదా? అనేది అధ్యయనం చేసి నివేదిక అందించాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధరు సీఎం కేసీఆర్ సూచించారు. శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ల బృందం వైజాగ్ వెళ్లింది. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి, సీఎండీకి నివేదిక అందించింది. అయితే, దీన్ని జీర్ణించుకోలేని కొందరు ఏపీ మంత్రులు, ఇక్కడి రాజకీయ నాయకులతోపాటు కొన్ని పత్రికలు పనిగట్టుకొని మరీ సింగరేణి సంస్థపై బురద జల్లుతున్నాయి. ప్రతి ఏటా భారీగా లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందంటూ అసత్యపు రాతలతో అక్కసు వెళ్లగక్కుతున్నాయి.
అప్పుల్లో ఉన్న సింగరేణి సంస్థ విశాఖ ఉక్కుకు ముడి పదార్థాలు ఎలా సరఫరా చేస్తుంది? అంటూ సీఎం కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. లాభాల్లో ఉన్న సింగరేణిని అప్పుల్లో ఉన్నదంటూ ప్రచారం చేసి, అటు కార్మికులు, ఇటు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రతి ఏడాది లాభాల్లో దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ వాటి వివరాలను బహిరంగంగానే వెల్లడిస్తున్నా అప్పుల పాలైందంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం చేయడం వారి మూర్ఖత్వానికి అద్దంపడుతున్నది. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, థర్మల్, సోలార్ విద్యుత్తుతోపాటు ఒడిశా రాష్ట్రంలో నైనీ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఏ సంస్థ అయినా నష్టాల్లో ఉంటే ఇన్ని వ్యాపారాలు ఎలా చేస్తుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని వ్యాపారాలు చేస్తున్న సంస్థ అప్పుల్లో ఉంటే కార్మికులకు జీతాలు, బోనస్లు, లాభాల వాటాలను సకాలంలో అకౌంట్లలో ఎలా జమచేస్తుందని నిలదీస్తున్నారు. 134 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ గురించి కొందరు అవివేకంతో మాట్లాడితే కార్మికులు సమ్మే స్థితిలో లేరు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో లాభం పొందాలని మాట్లాడుతున్న కార్మిక సంఘాలకు కార్మికులు తగినరీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.