హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడైన ఆయనను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 17వ అంతస్తులోని సిట్ కార్యాలయంలో అధికారులు దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి మొయినాబాద్ ఫాంహౌజ్లో అడ్డంగా దొరికిపోయినవారిలో ఒకరైన సింహయాజి గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు విమాన టికెట్ను బుక్ చేసినట్టు శ్రీనివాస్ అభియోగాలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ టికెట్ను, ఇతర వివరాలను శ్రీనివాస్ ముందుంచి.. ‘సింహయాజితో మీకున్న సంబంధం ఏమిటి? ఆయనకు టికెట్ ఎందుకు బుక్ చేశారు? టికెట్ బుక్ చేయాలని మీకు ఎవరైనా చెప్పారా? మీకు సింహయాజి ఎలా పరిచయం? ఎవరు పరిచయం చేశారు? మీరిద్దరు ఎన్నాళ్ల నుంచి టచ్లో ఉన్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై మీకేమైనా సమాచారం ఉన్నదా?ఇంకా బీజేపీలోని ఏయే కీలక నేతలతో మీకు పరిచయాలున్నాయి? వారితో ఎప్పుడైనా సంప్రదింపులు జరిపారా?’ అంటూ శ్రీనివాస్పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం.
దీంతో ఇంట్లో పూజల కోసమే సింహయాజికి టికెట్ బుక్చేశానని శ్రీనివాస్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో నిందితుడైన నందకుమార్తో గత నెల 14న శ్రీనివాస్ అరగంటపాటు ఫోన్లో సంభాషించినట్టు ఇప్పటికే ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు ఆ ఫోన్కాల్పై శ్రీనివాస్ను ఆరా తీయడంతోపాటు సింహయాజికి, శ్రీనివాస్కు మధ్య జరిగిన ఫోన్కాల్స్ డాటా ఆధారంగా కూడా పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తున్నది. వాటికి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా సిట్ అధికారులు రాష్ట్ర బీజేపీలోని ఓ కీలక నేతకు నోటీసులు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సోమవారం శ్రీనివాస్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్ అధికారులు.. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం. మంగళవారం శ్రీనివాస్ను విచారించేందుకు సిట్ అధికారులు కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది.
రాజ్నాథ్ సింహ్యాజి
రాజ్నాథ్సింగ్.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు. ఐదేండ్లపాటు ఆ పార్టీకి జాతీయ సారథ్య బాధత్యలను నిర్వర్తించారు. ప్రస్తుతం కేంద్రంలో రక్షణశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. బీజేపీలో కేంద్రమంత్రులతో మఠాధిపతి సింహయాజి స్వామికి విస్తృత పరిచయాలున్నాయి.
కేంద్ర ప్రముఖులను వ్యక్తిగత స్థాయిలో కలిసేంత శక్తిమంతుడు ఆయన. బీజేపీ నేత రాజ్నాథ్సింగ్ను కలిసిన సందర్భంలో పుష్పగుచ్ఛం అందజేస్తున్న సింహయాజి స్వామి
ఆ ముగ్గురిపై చర్యలకు న్యాయ సలహా
సోమవారం శ్రీనివాస్తోపాటు సిట్ ముందుకు రావాల్సిన బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ గైర్హాజరయ్యారు. దీంతో ఆ ముగ్గురిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై సిట్ అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నట్టు సమాచారం.