Bathukamma | పూల జాతరగా, ప్రకృతి వేడుకగా తెలంగాణ నేల జరుపుకొనే అతిపెద్ద పండుగ బతుకమ్మ.హైందవ సంప్రదాయంలో ప్రతి వేడుక వెనుకా ఒక కథ ఉంటుంది. ప్రతి సంబురానికీ ఒక సందర్భం ఉంటుంది. అలాగే బతుకమ్మ పుట్టుక వెనుకా చాలా గాథలు ఉన్నాయి. దాదాపు ప్రతి కథా ఒక స్త్రీ వ్యథ నుంచే పుట్టుకొచ్చింది. పూలను రాశిగా పేర్చి బతుకమ్మ ఆడే ఆచారం ఎప్పుడు పుట్టింది అన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, తెలంగాణ నేల మీద కనీసం పాతిక తరాలను చూసింది బతుకమ్మ.
దేవీ పురాణంలోని మహిషాసురుని వృత్తాంతం.. జానపదానికి వచ్చేసరికి బతుకమ్మ కథల్లో భాగమైంది. అత్యంత బలశాలి అయిన మహిషాసురుణ్ని సంహరించే శక్తి ఒక్క గౌరీమాతకే ఉంటుంది. ఆ తల్లి ఉగ్ర రూపంతో మహిషుడితో తలపడి, ఆ రాక్షసుణ్ని వధించి మహిషాసుర మర్దినిగా పేరుగాంచింది. ఆ భీకర పోరాటం తర్వాత గౌరీదేవి అలసిసొలసి యోగనిద్రలోకి వెళ్లిపోతుంది. జగన్మాతను ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి స్త్రీలంతా బతుకమ్మ పాటల రూపంలో వేడుకుంటారు.
మగువల తొమ్మిది రోజుల ప్రార్థనలకు స్పందించి, గౌరీదేవి జాగృతమవుతుంది. అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. ఆ తొమ్మిది రోజుల గౌరీ పూజలే.. అనంతర కాలంలో బతుకమ్మ పండుగగా ప్రసిద్ధి పొందాయని ఓ కథనం. పురాణాలలో గంగాగౌరీ సంవాదం సుప్రసిద్ధం. శివుడి తలకెక్కిన గంగను చూసి పార్వతీదేవి అసూయ పడుతుంది. అందరూ గంగనే పూజిస్తున్నారని తన తల్లితో చెప్పి ఆవేదన చెందుతుంది. గంగమీద నిన్ను పూలతెప్పలా తేలించి.. పూజించేలా చేస్తానని ఆ తల్లి మాటిస్తుంది. ఆ వాగ్దానమే బతుకమ్మ ఆచారంగా మారిందని, పూలతో బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి.. ఆటపాటలతో కొలిచి, గంగలో వదిలేసే ఆచారం ఏర్పడిందని మరో ప్రచారం.
రాశి గొలుతూ రావె రత్నాల గౌరీ… పువ్వుల్ల గౌరి కొమ్మల్ల గౌరి…పచ్చన్ని పాలవెల్లే గౌరమ్మ.. మీ ఇంటి కోడళ్లమే….అంటూ బతుకమ్మ ఆడుతారు పడతులు. ఈ ఆడపిల్లలు గౌరమ్మకు కోడళ్లంటే, గౌరమ్మ వీళ్ల పుట్టింటి ఆడపిల్ల అన్నది ఈ పదాల వరుసలోని భావన. నిజమే తెలంగాణ ప్రజలు మంగళగౌరిని తమ ఇంటి అమ్మాయే అనుకుంటారు. బతుకమ్మ పండుగ పుట్టుక వెనుకా ఇలాంటి కథలే కనిపిస్తాయి. వాటిలో మొదటగా దాదాపు వెయ్యేళ్ల క్రితం వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయానికి సంబంధించిన కథలోకి వెళ్లాలి. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం కల్యాణి చాళుక్యుల పాలనలో ఉండేది. వేములవాడ చాళుక్యులు వీరికి సామంతులుగా ఉన్నారు. ఆ సమయంలో కల్యాణి చాళుక్యులకు, చోళులకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో వేములవాడ చాళుక్యులు కల్యాణి చాళుక్యుల పక్షం వహించారు. అప్పటికే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ సమయంలో చోళ చక్రవర్తి రాజరాజు కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ ఆలయంలోని భారీ శివలింగాల్ని పెకలించి తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా ఇచ్చాడట. ఇక్కడి బృహదమ్మ (పార్వతి) నుంచి బృహదీశ్వరుడిని వేరుచేయడంతో తెలంగాణ ప్రజలు నొచ్చుకున్నారు. ఆమెకు సాంత్వన చేకూర్చేందుకు శివలింగాకృతిలో గౌరీదేవి రూపంగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడారట. ఈ ఘటనకు గుర్తుగా ప్రతి ఏడాదీ ఇలా చేస్తున్నారని కథ. బృహదమ్మ (గొప్పది)నే జన వ్యవహారంలో ‘బతుకమ్మ’గా మారిందని అంటారు.
దక్షిణ కాశీగా సుప్రసిద్ధమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయం ఎనిమిదో శతాబ్దంలో నిర్మితమైంది. ఈ దేవాలయాన్ని లేంబాలవాటిక అని, భాస్కర క్షేత్రమని, హరిహర క్షేత్రమనీ అంటారు. ఈ దేవాలయంలో పార్వతి, రాజరాజేశ్వరీ సమేతుడైన శివుడు మహాలింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ దేవాలయం గురించి భవిష్య పురాణంలోనూ ప్రస్తావన ఉంది. అర్జునుడి మనుమడైన నరేంద్రుడు అనుకోకుండా ఓ ముని చావుకు కారణం అవుతాడు.
ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. ఈ దేవాలయాన్ని వేములవాడ చాళుక్య రాజు విక్రమాదిత్య యుద్ధమల్లుని మనుమడు మొదటి నరసింహుడు నిర్మించాడు. ఇతనికి రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ పేరుతోనే రాజరాజేశ్వర దేవాలయం అనే పేరు వచ్చింది. తమిళనాడును పరిపాలించే రాజరాజచోళుడి తండ్రి రెండవ పరాంతక సుందర చోళుడు రాష్ట్రకూటుల నుంచి తనను కాపాడమని పరమేశ్వరుడిని వేడుకుంటాడు.
ఆ భక్తితోనే తన కుమారుడికి రాజరాజు అని నామకరణం చేస్తాడు. రాజరాజు కూడా రాజరాజేశ్వరుడి భక్తుడే. అంతలోనే, రాజరాజచోళుడి కొడుకు రాజేంద్ర చోళుడు ఈ ప్రాంతంపై దాడి చేసి.. రాజరాజేశ్వర ఆలయంలోని విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లి తన తండ్రికి కానుకగా ఇస్తాడు. ఆ స్వామిని ప్రతిష్ఠించడం కోసమే రాజరాజు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడని అంటారు. దేవాలయ నిర్మాణానికి చాళుక్యుల నుంచి కప్పంగా వసూలు చేసిన సొమ్మునే వినియోగించాడు.
ఆ తర్వాత చాళుక్యులు రాజరాజేశ్వర ఆలయంలో పునఃప్రతిష్ఠించిన మూర్తికి, బృహదీశ్వరాలయంలోని శివలింగానికి అనేక పోలికలు కనిపిస్తాయి. ఆ సంఘటనతో కల్యాణి చాళుక్యులు, రాజ్య ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శివుడికి (బృహదీశ్వరుడు) దూరమైన ఒంటరి పార్వతిని (బృహదీశ్వరమ్మను) వారు చూడలేకపోయారు. పసుపుతో గౌరమ్మను చేసి, తొమ్మిదిరోజులు పువ్వులతో బతుకమ్మను పేర్చి, శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ, పూజించి శివుడి దగ్గరికి వెళ్లిరమ్మంటూ నీళ్లలో వదులుతారు. అదే అనంతర కాలంలో తెలంగాణ ప్రజల బతుకమ్మ ఆచారంగా మారిందని ఓ విశ్లేషణ.
మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అలసిపోయి మూర్ఛిల్లిందట. అప్పుడు ఆమెను మేలుకొలిపేందుకు దేవుళ్లంతా పూలగౌరమ్మను పేర్చి పాటలు పాడారట. బతుకమ్మా బతుకమ్మా అంటూ వేడుకున్నారట. ఇది జరిగింది దసరా నవరాత్రుల్లోనేననీ, అప్పటినుంచీ అమ్మ విజయానికి గుర్తుగా బతుకమ్మ వేడుక చేసుకుంటున్నారనీ మరో కథనం.
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు ఏడుగురు కొడుకులు, ఒక్కతే కూతురు. ఆమె పెళ్లి చేసి తల్లిదండ్రులు కాశీయాత్రకు వెళతారు. ఈ మధ్యకాలంలో కూతురు పుట్టింటికి వస్తుంది. ఆమె కొద్దిరోజులు అక్కడే ఉండవలసి వస్తుంది. అవి దసరా రోజులు. అనుకోకుండా రావడంతో ఆమె దగ్గర పండుగకు సరిపడే చీరలూ, నగలూ లేవు. అందుకే పండుగకు పెట్టుకోవడానికి కాళ్ల కడియాలూ, పట్టుచీరా అడుగుతుంది. మొదటి ఆరుగురు వదినలూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. చివరి వదిన మాత్రం తీసుకున్న కడియాలు సొట్టపోయినా, చీర చిరిగిపోయినా బాగుండదని హెచ్చరిస్తుంది. కానీ పండుగ సమయంలో ఆటలాడటంతో కడియాలు సొట్టబోయి, వాటికి తగులుకుని చీర చిరిగిపోతుంది. భర్తతో కొట్లాడి సొంత అన్నతోనే ఆడపడుచును చంపిస్తుంది చిన్నవదిన. చివరికి ఆమె చనిపోయిన చోట అందమైన కొలను ఏర్పడుతుంది. కాశీ నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులు అందులో తామరను కోయబోతే ముట్టుకోవద్దని కూతురి గొంతు వినిపిస్తుంది. ఈ కథలను చిలుకా గోరింకలుగా మారిన ఆమె కళ్లు భర్తకు చెబుతాయి. ఆ రాజ్యపు ఆడపిల్లలంతా పదిరోజులు పూలగౌరిని పేర్చి ఆ కొలనులో వదిలితే చివరి రోజు పదహారేళ్ల బాలాకుమారిగా తిరిగి వస్తానని పలుకుతుంది తామర. అలా దసరా పండుగ సమయంలో ఆడబిడ్డ బతికివచ్చిన గుర్తుగా ఇప్పటికీ బతుకమ్మను పేర్చుకుంటున్నారని ప్రాచుర్యంలో ఉన్న ఒక గాథ.
దక్షిణ భారతదేశానికి చెందిన చోళ రాజ్యానికి రాజు ధర్మాంగదుడు. ఆయనకు పుట్టిన వందమంది కుమారులు యుద్ధంలో చనిపోతే శ్రీమహాలక్ష్మి కోసం భార్యాభర్తలిద్దరూ తపస్సు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు. సిరుల తల్లి వాళ్ల కడుపున పుడుతుంది. చిన్నతనంలో ఎన్నో గండాలను దాటి, మహిమలు చూపిస్తుంది. అందుకే ఆమె చల్లగా ఉండాలని బతుకమ్మా అని పిలిచేవాళ్లనీ, లక్ష్మీదేవి అంశ కాబట్టి ఆమెకు పూజలు చేసేవారన్నది తెలంగాణలో ధర్మాంగదుడి కథగా పాటల రూపంలో ప్రాచుర్యంలో ఉన్న మరో కథనం. నిజాం నవాబుల కాలంలో అధికారుల దాష్టీకానికి బలైపోయిన ఆడపిల్లల గుర్తుగా వాళ్లను తలుచుకుంటూ, ఇలాంటి కష్టం మరెవరికీ రాకుండా చూడమంటూ గౌరీదేవిని ఇలా బతుకమ్మగా పూజిస్తున్నారన్నది చరిత్రకారులు చెబుతున్న ఇంకో కథనం.
కాపు దంపతులకు ఏడుగురు సంతానం పుడితే ఒక ఆడపిల్ల బతుకుతుంది. ఆమెకు బతుకమ్మ అనే పేరు పెడతారు. ఆ తర్వాత అబ్బాయి పుడతాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు అవుతాయి. ఒకసారి వదినా మరదళ్లు చెరువుగట్టున స్నానం చేసి వస్తారు. అప్పుడు ఒకరి చీరను మరొకరు ధరిస్తారు. ఈ విషయంలో మాటామాటా రావడంతో ఆడబిడ్డను చంపేసి, చెరువుగట్టునే పాతి పెడుతుంది మరదలు. ఆ ప్రాంతంలో తంగేడు విరగబూసిందట. తన బాధను భర్తకు కలలో కనిపించి చెప్పిందట బతుకమ్మ. అప్పటినుంచి ఆమె గుర్తుగా తంగేడుపూలతో బతుకమ్మను పేర్చి పండుగ చేశారట.