పటాన్చెరు రూరల్, డిసెంబర్ 28 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో జూన్ 30న సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన కేసులో కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అధికారి, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో బీడీఎల్ భానూర్ పోలీసులు సిగాచి సీఈవో అమిత్రాజ్ సిన్హాను శనివారం రాత్రి అరెస్టు చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా కంది జైలుకు తరలించారు. ఈ కేసులో అమిత్రాజ్ సిన్హా ఏ2గా ఉన్నారు. ఈ పరిశ్రమలో జరిగిన పేలుడులో 54 మంది మరణించిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆగ్రహంతోనే చర్యలు..
సిగాచి ప్రమాదంపై ఈ నెల 30న హైకోర్టులో కేసు విచారణ జరగనున్నది. బాధితులకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం, ప్రమాదంలో 54 మంది మరణిస్తే యాజమాన్యంపై సర్కార్ కఠినంగా వ్యవహరించకపోవడంపై ఈనెల 9న హైకోర్టు ప్రభుత్వం, అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. బాధ్యులను అరెస్టు చేయకపోవడాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సరైన విచారణ, దర్యాప్తు చేయడం లేదని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ, నిపుణుల కమిటీ తేల్చాయి. స్ప్రే డ్రైయర్ పేలుడుపై దర్యాప్తు నివేదికను ఇచ్చారు. ఈ కమిటీల నివేదిక మేరకే అధికారులు యాజమాన్యంపై చర్యలకు దిగారు.
ఏ2గా ఉన్న అమిత్రాజ్ సిన్హాను శనివారం రాత్రి అరెస్టు రిమాండ్కు తరలించారు. మిగిలిన నిందితుల అరెస్టుపై పోలీసులు వివరణ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు సీఎం, యాజమాన్యం ఇస్తుందని ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం మాత్రం పూర్తి స్థాయిలో చెల్లించలేదు. 54 మంది కుటుంబాలకు ఇప్పటివరకు పరిశ్రమ తరపున కేవలం రూ.25 లక్షలే అందజేశారు. పరిశ్రమలో బీమా, ఇతర బెనిఫిట్స్ మాత్రం కొందరికే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష చొప్పున కొంతమందికి అందజేసింది. మృతదేహాలు దొరకని 8మంది కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికెట్స్ వస్తేనే అందరికీ నష్టపరిహారం చెల్లిస్తారేమో అనే ఆశతో బాధిత కుటుంబాలు వేచి ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో రూ. 75లక్షల చొప్పున కంపెనీ నుంచి ఇప్పించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.