సిద్దిపేట, మే 17: దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ధాన్యం సేకరించాల్సిన కేంద్రం తొండిగా వ్యవహరించి కొర్రీలు పెట్టిందని, రైతుల సంక్షేమం కోసం ఆర్థిక భారమైనా సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు వెచ్చించి వడ్లు కొంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. మంగళవారం సిద్దిపేటలో వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని ఎర్ర చెరువు వద్ద ఉన్న ఆధునిక ధోబీఘాట్లో రూ.1.10 కోట్లతో మెకనైజ్డ్ శారీ, బెడ్షీట్ రోలింగ్ మెషిన్లు, టాటాఏస్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో 2020-21 వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.4.62 కోట్ల కమీషన్ చెక్కులను మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లతో రైతులు, మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. గతంలో మండలానికి ఐదారు కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు గ్రామానికో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టకుండా సాఫీగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, అధికారులు, ఐకేపీ సిబ్బంది కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. 2020-21 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 215 ఐకేపీ, 168 పీఏసీఎస్, ఏడు ఏఎంసీ, నాలుగు మెప్మా కేంద్రాల ద్వారా రూ.4.62 కోట్ల చెక్కు, 2018-19లో 11 పీఏసీఎస్ కేంద్రాలకు మక్కల కొనుగోలు కమీషన్ రూ.75.22 లక్షల చెక్కును పంపిణీచేశారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపి సమృద్ధిగా నీరివ్వడంతో గుంట పొలం ఎండకుండా జిల్లాలో 5 లక్షల టన్నుల ధాన్యం పండిందని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు పల్లెల్లోని ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని.. నేడు రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని దింపేందుకు బిహార్ నుంచి కూలీలు వస్తున్నారని ఉద్ఘాటించారు. నాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్ వాసులు వస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని సిద్ధివినాయక ఆలయ ద్వాదశ వార్షికోత్సవానికి హాజరైన ఆయన, తెప్పోత్సవంలో పాల్గొని పూజలు చేశారు.