చేర్యాల, జనవరి 7: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద నిర్వహించిన కల్యాణోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి సమర్పించారు.
కల్యాణోత్సవం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగరాజు దేశికేంద్ర శివాచార్యుల స్వామీజీ పర్యవేక్షణలో జరిగింది. కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెల్లి క్షేత్రానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామివారి తరఫున పడిగన్నగారి వంశస్థులు, అమ్మవార్ల తరఫున మహాదేవుని వంశస్థులు పాల్గొని కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.