చేర్యాల, జనవరి 22 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్కు చెందిన 50 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకొన్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి సోదరి ఎల్లమ్మను దర్శించుకోవడంతోపాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. సోమవారం పెద్ద పట్నం వేసి, అగ్నిగుండాలు వేయనున్నారు. ఆలయ అధికా రులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.