చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్
విజయవంతంగా మిషన్ ఇంద్రధనుష్
21న ఢిల్లీలో బహూకరించనున్న కేంద్రం
వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు హర్షం
హైదరాబాద్/సిద్దిపేట, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): చిన్న పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్దిపేట అరుదైన రికార్డు సృష్టించింది. నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని గెలుచుకున్నది. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు-2019ను ప్రకటించింది. ఈ నెల 20-21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం అందజేయనున్నది.
వివిధ కారణాలతో టీకాలు వేయించుకోలేని చిన్నారులను గుర్తించి, వారందరికీ వ్యాక్సిన్లు వేసే లక్ష్యంతో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. అవార్డు రావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన వైద్యారోగ్యశాఖఅధికారులు, సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి అన్ని రకాల వ్యాక్సిన్లు వేసి, సంపూర్ణ రోగనిరోధకశక్తి సాధించేలా వైద్యారోగ్యశాఖ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.