మధిర, ఫిబ్రవరి 12 : ఖమ్మం జిల్లా మధిర మండలం సిద్ధినేనిగూడెం పంచాయతీ ఖాతా ఫ్రీజ్ అయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొనడాన్ని ఆ గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి పెద్దినాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం సరికాదని ఆయన సూచించారు. ఆదివారం మధిరలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిరిపురం సర్పంచ్ కనకపుడి బుచ్చయ్య, రామచంద్రాపురం సర్పంచ్ మార్త నరసింహారావుతో కలిసి పెద్దినాగిరెడ్డి మాట్లాడారు.
తనకు సిరిపురం బ్రాంచ్లో వ్యక్తిగత అకౌంటే లేదని, పంచాయతీ అకౌంట్ ఉన్నా అది ఫ్రీజ్ కాలేదని, ఫ్రీజ్ అయినట్టు భట్టి విక్రమార్క అసత్యాలు పలుకడంపై ఆయన మండిపడ్డారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు లేవని, బిల్లులు కావడం లేదని సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీలో భట్టి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భట్టి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.