రెబ్బెన/ఆసిఫాబాద్ టౌన్, జూలై 12: హైదరాబాద్లోని మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ ఘటన మరువక ముందే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. రెబ్బెన ఎస్సై భవానీసేన్గౌడ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మంగళవారం ఓ యువతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. రెబ్బెనకు చెందిన ఓ యువతి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నది. స్టడీ మెటీరియల్ విషయాన్ని ఆమె పలువురి వద్ద ప్రస్తావించగా, పోలీస్ స్టేషన్కు వెళ్తే దొరికే అవకాశముంటుందని చెప్పారు. సుమారు 20 రోజుల క్రితం రెబ్బెన పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై భవానీసేన్ గౌడ్ను కలిసింది. సాయంకోరి వచ్చిన ఆ యువతిపై కన్నేసిన ఆయన ఆమె ఫోన్ నంబర్ తీసుకొన్నాడు.
నిత్యం ఫోన్ చేస్తూ పోలీస్స్టేషన్కు పిలిపించుకొని గంటల తరబడి కూర్చుండబెట్టి.. రేపుమాపంటూ కాలక్షేపం చేశాడు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఓ రోజు ఈ విషయాన్ని పోలీసు సిబ్బందికి తెలియజేయగా, ఎవ్వరికీ చెప్పొద్దని నచ్చజెప్పి పంపించారు. తరచూ ఫోన్ చేస్తుండటంతో అతని నంబర్ను బ్లాక్ చేసింది. దీంతో వేరే నంబర్తో కూడా ఫోన్ చేస్తూ వచ్చాడు. రోజు రోజుకూ వేధింపులు ఎక్కువకావడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారితో కలిసి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు ఎస్సైని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ను వివరణ కోరగా.. యువతి ఫిర్యాదు చేసిందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ వ్యవహారాన్ని అవమానంగా భావించిన అతని భార్య వాసంతి రెబ్బెన ఎస్సై క్వార్టర్స్లో శానిటైజర్ తాగింది. స్థానికులు గమనించి రెబ్బెన పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు.