నర్మెట, ఏప్రిల్ 4: భూ వివాదం కేసులో డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గుర్రాల రామకృష్ణకు జనగామ జిల్లా నర్మెటలో రెండు ఎకరాల భూమి ఉన్నది. ఎకరానికి రూ.16.90 లక్షల చొప్పున రెండెకరాలను కొనుగోలు చేసేందుకు వేల్పుల వెంకటేశం ముందుకురాగా, బోడ నరేందర్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. ఇందుకోసం బయానాగా రూ.3.50 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలని రామకృష్ణ కోరగా, హద్దులు కొలిచి ఇవ్వాలని వెంకటేశం అడిగాడు. ఆ భూమిలో మిర్చి సాగుచేశానని, పంట పూర్తయ్యాక కొలిచి హద్దులు చూపిస్తానని రామకృష్ణ చెప్పాడు.
దీంతో ఆ భూమిని తమకు కాకుండా వేరే వాళ్లకు విక్రయించారని, అందుకే కొలిచి ఇవ్వట్లేదని కొనుగోలుదారులు ఆరోపించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మధ్యవర్తి నరేందర్.. నర్మెట పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఇరువర్గాలను పోలీస్స్టేషన్కు పిలిపించిన ఎస్సై బయానా డబ్బులను తిరిగి ఇచ్చేయాలని, డబ్బులు ఇచ్చి రెండు నెలలు పూర్తయినందున అదనంగా రూ.75 వేలు ఇవ్వాలని రామకృష్ణను ఆదేశించాడు. అదేవిధంగా సెటిల్ చేసినందుకు తనకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రామకృష్ణ ఏసీబీని సంప్రదించాడు. పోలీస్స్టేషన్లో డబ్బులు తీసుకుంటుండగా ఎస్సైని సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ పూర్తిచేసి నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్టు డీఏస్పీ తెలిపారు.