హైదరాబాద్, మార్చి 29 : తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2వ తేదీన ప్రగతి భవన్లోని జనహితలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, అర్వింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ అనిల్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతి భవన్లోని జనహితలో ఏప్రిల్ 2న ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతాయని అన్నారు. ఈకార్యక్రమంలో వేదపండితుల ఆశీర్వచనం అనంతరం బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మచే పంచాంగ పఠనం ఉంటుందని తెలిపారు. వేదపండితులకు ఉగాది పురస్కారాలు అందజేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఉంటుందని ఆయన తెలిపారు.
అదేరోజు సాయంత్రం ఆరున్నరకు రవీంద్ర భారతిలో కవిసమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తాయని తెలిపారు. ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ లోని కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.