హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారిని ఫిబ్రవరిలో దర్శించుకొనేందుకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి. ప్రతి నెలవారీ టికెట్ల కోటాను టీటీడీ 24, 25న విడుదల చేస్తున్నది. ఇందులో భాగంగా ఫిబ్రవరి కోటాను దక్కించుకొనేందుకు భక్తులు పోటాపోటీ పడ్డారు. చాలా సేపు సర్వర్ బిజీ రావడంతో కొందరు భక్తులు దర్శన టికెట్ల కోసం ఆన్లైన్లో కుస్తీ పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్ కూడా అరగంటలోనే పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బస చేసేందుకు కొండపై ఉన్న వసతి గదులతో పాటు తిరుపతిలోని వసతి గృహాల స్లాట్ను విడుదల చేసింది.