హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థ రికార్డు సృష్టించినట్టు ఆ సంస్థ అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల్లో తమ సంస్థలో చదివిన నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే నాలుగు 100 పర్సంటైల్ సాధించిన ఏకైక విద్యాసంస్థ శ్రీ చైతన్య అని పేర్కొన్నారు. వావిలాల చిద్విలాస్రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేశ్, జీ అభిరామ్, బిక్కిన అభినవ్చౌదరి 100 పర్సంటైల్ సాధించినట్టు వివరించారు.
సబ్జెక్టులపరంగా 70 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు తెలిపారు. తమ సంస్థ అనుసరిస్తున్న ప్రత్యేక షెడ్యూల్, అనుభవం గల ఫ్యాకల్టీ, మైక్రో షెడ్యూల్, టెస్టింగ్ విధానం విద్యార్థులకు ఎంతో దోహదం చేసిందని తెలిపారు. జేఈఈ మెయిన్ తుది ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాస్థాయిలో 10 లోపు నాలుగు ర్యాంకులు సాధించే దిశగా శ్రీచైతన్య దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ, సిబ్బందిని సంస్థ అధినేత బీఎస్ రావు అభినందించారు.