హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయసేవల సంస్థ అందజేస్తున్న సేవలపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా పలు లఘు చిత్రాలను నిర్మించాయి. డీ సాయిప్రసాద్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాలను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ చీఫ్ ప్యాట్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. బాల్య వివాహలపై ‘సీతకథ’, బాలికల అక్రమ రవాణాపై ‘అంకురం’, మాదకద్రవ్య వ్యసనాల నుంచి విముక్తిపై ‘ముందడుగు’, అసంఘటిత కార్మికులకు సాయం అందించడంపై ‘నంది’, ఆన్లైన్లో ఆర్థిక మోసాలపై ‘గెలుపు’, అటవీ ప్రాంతాల్లో శిశు సంరక్షణపై ‘జోజో పాపాయి’, దాంపత్య వివాదాలపై ‘తోడు-నీడ’, మానసిక వ్యాధులపై ‘మనోవ్యాధి’, సొంత వ్యాపారాలు చేసుకునే పేదలకు ఆర్థిక సాయం అందించడంపై ‘సంకల్పం’, బాలికలపై లైంగిక నేరాలపై ‘ప్రేరణ’, ఆన్లైన్లో మహిళలను వంచించడంపై ‘వల’ శీర్షికతో రూపొందిన ఈ లఘు చిత్రాలతోపాటు న్యాయసేవలపై చిత్రీకరించిన ఓ గీతాన్ని కూడా విడుదల చేశారు. రాష్ట్రంలోని 700 థియేటర్లలో సినిమా విరామ సమయంలో ఈ లఘు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా చైతన్య కార్యక్రమాలను రూపొందించాలని జస్టిస్ అరాధే సూచించారు.