హైదరాబాదు, జూన్18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండల కేంద్రానికి 6.కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ జైన క్షేత్రం కొలనుపాక ఊబదిబ్బపైన 900 సంవత్సరాల చరిత్రగల జైన శాసనానికి ప్రమాదం పొంచి ఉందని, సత్వరమే కాపాడాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక సోమేశ్వరస్వామి దేవాలయ పరిరక్షణ పనుల పర్యవేక్షణలో భాగంగా హెరిటేజ్ ఆరిటెక్టు శ్రీలేఖతో కలసి సదరు స్తంభాన్ని శనివారం రోజున ఆయన పరిశీలించారు.
ముండ్లపొదల్లో పడివున్న ఆ శాసనం క్రీ.శ.1125 నాటిదని, మూడడుగుల చదరంలో 23 అడుగుల ఎత్తుగల ఈ స్తంభం నలువైపులా 151 పంక్తులతో కన్నడ లిపిలో చెకి ఉన్నదని వివరించారు. శాసనంలో కల్యాణ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని కుమారుడైన సోమేశ్వరుని ప్రశస్తితోపాటు స్థానిక అంబరతిలకమనే జైనబసది అంగరంగ భోగానికి మహా ప్రధాని స్వామి దండనాయకుని విజ్ఞప్తితో పానుపురాయి అనే గ్రామాన్ని సర్వబాధా పరిహారంగా దానం చేసినట్టు తెలియజేస్తున్నదని తెలిపారు. కుమార సోమేశ్వరుడు, త్రికళింగాధిపతిని, ద్రావిడ దేశాధిపతిని జయించాడనీ, అతని దండనాయకుడైన స్వామిదేవుడు హరి, హర, జిన, బుద్ధ అనే చతుస్సమయాలను ప్రోత్సహించాడని శాసనంలో పేర్కొన్నట్టు తెలిపారు. గతంలో నేలటూరు వెంకటరమణయ్య, పీవీపీ శాస్త్రి, జీ జవహర్లాల్, విరువింటి గోపాలకృష్ణ, ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఈ శాసనంపై విసృ్తత పరిశోధనలు గావించారని, అంతటి చారిత్రక ప్రాధాన్యతగల ఈ శాసనాన్ని, ఊబదిబ్బపై గల అంబరతిలక జైనబసది, అంబికాలయ శిథిలాలను పదిలపరచి పర్యాటకులు వెళ్లేలా చకటి దారిని ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని కొలనుపాక గ్రామస్తులకు శివనాగిరెడ్డి, శ్రీలేఖ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.