Shiva Balakrishna | హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సమీప బంధువులు, ఆయన స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆయన ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఏకరాల భూమిని గుర్తించామని తెలిపారు. భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తించామన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ సుమారు రూ. 60 కోట్లు ఉంటుంది. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ. 75 కోట్లు ఉంటుందన్నారు. ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి. శివ బాలకృష్ణపై కేసు నమోదు చేసి, రేపు న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామన్నారు. తదుపరి కస్టడీకి తీసుకుంటాం.. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించ లేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
శివ బాలకృష్ణ అరెస్ట్తో హెచ్ఎండీఏలో పని చేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హెచ్ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా.. గతంలో అనుమతుల ఇచ్చిన ఫైల్స్ అన్నింటిని పరిశీలించే యోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైరేజ్ అపార్ట్మెంట్స్కు అనుమతుల్లో వారు భారీగా లంచాలు పొందినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ రెండు రోజుల ముందు భారీ ఎత్తున లాండ్ కన్జర్వేషన్ జరిగిందని తెలుస్తోంది. ఉప్పల్లో శివ బాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణ సోదరి, ఇద్దరు కొడుకులు హెచ్ఎండీఏలో శివ బాలక్రిష్ణ దగ్గరే పని చేశారు. శివ బాలకృష్ణ సోదరి కొడుకులు ఇద్దరు శివ బాలకృష్ణ బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించారు. హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పరిధిలో సైతం భారీగా భూ మార్పిడి జరిగిందని సమాచారం.. ఆ రెండు రోజుల్లో రూ. 200 కోట్ల భూములు చేతులు మారినట్టు ఏసీబీ గుర్తించింది.