హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలి లైన్ వుమన్గా ఉద్యోగం పొందిన బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్ వుమన్ నియామక పత్రాన్ని మంత్రి ఆమెకు అందించారు. శిరీష.. టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ నోటిఫికేషన్లో భాగంగా దరఖాస్తు చేసుకొని ఉద్యోగం సంపాదించినట్టు తెలిపారు. లైన్మెన్గా ఇప్పటివరకు మహిళలకు అవకాశంలేదని, కానీ గత ఏడాది తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా మహిళను లైన్ వుమన్ను తీసుకొన్నామని చెప్పారు. దేశ చరిత్రలో లైన్ వుమన్ గా ఉద్యోగమిచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థకే దక్కుతుందని పేర్కొన్నారు.
సంతోషంగా ఉన్నది
మహిళా లైన్ వుమన్గా టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థలో ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉన్నదని, కష్టపడి పనిచేసి సంస్థకు పేరు తెస్తానని శిరీష తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చునన్నారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థకు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, సీఎండీ రఘుమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.