హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కార్టూనిస్టు శేఖర్ స్మారక అవార్డు2022ను ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర అందుకొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రూ.10 వేల నగదు బహూకరించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, పొలిటికల్ కార్టూన్ అనగానే శేఖర్ గుర్తుకు వస్తారని, ఆయన కార్టూన్లకు ఆ శక్తి ఉన్నదని పేర్కొన్నారు. శేఖర్ పేరిట ఇస్తున్న ఈ అవార్డు తనకు ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డు కంటే చాలా గొప్పదని సురేంద్ర తెలిపారు.
తనతో పాటు మరికొంతమంది.. కార్టూన్లు ఎలా గీయాలో శేఖర్ దగ్గరే నేర్చుకున్నామని సాక్షి కార్టూనిస్టు శంకర్ తెలిపారు. బ్యాంకు బాబు అనే కార్టూన్ల పుస్తకంతో శేఖర్ కొత్త వొరవడి నెలకొల్పారని, శేఖర్ సతీమణి చంద్రకళకు చదువు, కంప్యూటర్ నేర్పించి ఆమెతో పుస్తకం కూడా రాయించడం గొప్ప విషయమని కార్టూనిస్టు మృత్యుంజయ కొనియాడారు. అనంతరం శేఖర్ కుమారుడు నందు సురేంద్రను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ కార్టూనిస్టులు నర్సిం, నారు, రాకేశ్, అవినాశ్, జేవీ, జర్నలిస్టులు కృష్ణ, అసరి రాజు, సాయి, శివ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.