హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరేండ్ల క్రితం అందించిన ఆపన్న హస్తం.. శరణ్య జీవితంలో కొత్త వెలుగులు నింపింది.. బ్రెయిన్ ట్యూమర్తో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలిక కేటీఆర్ అండతో బతికి బయటపడింది. క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కిన నాటి చిన్నారి ఇటీవల పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నాడు సాయం చేసిన కేటీఆర్ను హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో కలిసి భావోద్వేగానికి గురైంది.. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగకుంటూ మనసున్న మారాజుకు మనసారా కృతజ్ఞతలు తెలిపింది.
కేటీఆర్ ఆమెను దగ్గరకు తీసుకొని ‘గాడ్ బ్లెస్యూ శరణ్య’అంటూ అభినందించడంతో మురిసిపోయింది. హైదరాబాద్లోని ప్యారడైజ్ బాలంరాయికి చెందిన కే నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య 2019 లో బ్రెయిన్ ట్యూమర్ బారినపడ్డది. తమ బిడ్డ దయనీయస్థితిని చూసి తల్లిదండ్రులు కలతచెందారు..ప్రైవేట్ ఉద్యోగులైన వీరు ఆర్థిక శక్తిమేరకు పలు దవాఖానల్లో చికిత్స చేయించారు. అయితే శరణ్య ప్రాణాలకు ముప్పు ఉన్నదని చికిత్సకు రూ. 20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరులేకపోవడంతో హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో చేర్పించేందుకు వారంపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శరణ్య ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె చిన్నమ్మ పూజిత ఎక్స్ వేదికగా ఆదుకోవాలని కేటీఆర్కు విజ్ఞప్తిచేశారు. వారి విజ్ఞప్తికి ఆయన చలించిపోయారు. అరగంటలోనే తన బృందాన్ని రంగంలోకి దింపారు. ట్వీట్ చేసిన రోజు ఆదివారం సెలవుదినమైనప్పటికీ కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది హుటాహుటిన దవాఖానలో చేర్పించారు. శరణ్యకు వైద్యులు స్టంట్ వేయడంతో పాటు మేజర్ సర్జరీ నిర్వహించారు. అలాగే రూ. 3లక్షల ఖరీదైన రేడియేషన్ థెరపీని స్వయంగా పర్యవేక్షించి చేయించారు. సర్జరీ నుంచి డిశ్చార్జి వరకు ఆర్థికంగా అండగా నిలిచారు. మొత్తంగా రూ. 20 లక్షల విలువైన చికిత్సను నయాపైసా ఖర్చులేకుండా అందించారు. ఆదివారం కేటీఆర్ను కలిసిన సందర్భంగానే తాము దవాఖానలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని శరణ్య తల్లి భావోద్వేగంతో చెప్పారు.
ప్రాణాపాయస్థితి నుంచి గట్టెక్కిన శరణ్య చదువును కొనసాగించింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 384 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. పాసైన సంతోషాన్ని తనకు సాయం చేసిన కేటీఆర్తో కలిసి పంచుకోవాలని తలచింది. ఈ క్రమంలో ఆదివారం తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో కలిసి నందినగర్లోని నివాసంలో ఆయనను కలిసింది.