కరీమాబాద్, అక్టోబర్ 8: ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలకు సర్కారే ఇల్లు కట్టిస్తుండగా, ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆరే మేనమామ అయ్యారు. డబ్బులు లేక ఏ ఆడబిడ్డ తల్లిదండ్రులు పెండ్లికి ఇబ్బందులు పడొద్దని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారంచుట్టారు. ఒక ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి రూ.లక్ష నూట పదహార్లు అందజేస్తున్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన టైలర్ ఎండీ గౌస్ ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లకు షాదీముబారక్ ద్వారా డబ్బులు వచ్చాయి. అదీ ఎలాంటి ఫైరవీలు లేకుండా అధికారులు చెక్కులు అందజేశారు. దరఖాస్తు చేసుకున్నాక కొద్దిరోజులకే అధికారులు ఫోన్ చేసి చెక్కులు అందజేశారు. ‘టైలరింగ్ పనిచేసే మాలాంటి వాళ్లకు లక్ష రూపాయలు ఎన్ని రోజులు కష్టపడితే వస్తయ్. పేదోళ్ల గురించి ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు చేతులెత్తి మొక్కుతున్న’ అని గౌస్ సంతోషంగా చెప్పారు.