హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్జీఎస్టీ) అధికారులు సోమవారం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై 16 బృందాలు దాడులు నిర్వహించాయి. హైదరాబాద్ నగరంలోని రెండు భవనాలలో ఉన్న సుశీ సంస్థలకు చెందిన కంపెనీలపై నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు.
సోమవారం ఉదయం సుమారు 11:30 గంటలకు తనిఖీలు ప్రారంభం కాగా, రాత్రి 7 గంటలకు ముగిశాయి. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని లభ్యమైన పత్రాల ద్వారా నిర్ధారించారు. వీటితో పాటు ఈ కంపెనీల్లోని ల్యాప్టాప్స్, కంప్యూటర్లలోని సమాచారం ప్రకారం పలు అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు కూడా జరిగినట్టు గుర్తించారు.
ఈ 16 సంస్థల్లో ఒక సంస్థ సహకరించనందున ఆ సంస్థ కార్యాలయంలోని బీరువాలోఉన్న లాకర్ను సీల్ చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా క్రయ విక్రయాలు జరపడం తదితర అక్రమాలకూ పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. ప్రాథమిక అంచనా మేరకు సుశీ గ్రూపుల సంస్థలు రూ. 100 కోట్ల పన్నుల ఎగవేతకు పాల్పడ్డట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఈ పన్నుల ఎగవేతపై విచారణను పూర్తి స్థాయిలో పూర్తి చేసి, స్పష్టమైన నిర్దారణకు వాణిజ్య పన్నుల శాఖ రానుంది.