ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24: విశ్వవిద్యాలయాల భూముల్లో హైకోర్టు నిర్మించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ వర్సిటీ నుంచి ప్రభుత్వం తీసుకున్న 100 ఎకరాల భూమిని తిరిగి వర్సిటీలకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ.. పరిశోధనలు పెంపొందించేందుకు ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే భూములను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరిన్ని భూములు కేటాయించాల్సింది పోయి, ఉన్న భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, సాయికిరణ్, కృష్ణ, ప్రశాంత్, రాజు, శ్రీధర్, నిహారిక, హుస్సేన్, లావణ్య, కార్తీక్, రాజేంద్రబాబు, సందీప్, యశ్వంత్, రాజ్కుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.