హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్: రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ రెండు రోజుల సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, కొత్తగూడెం, హుస్నాబాద్లో భారీ బహిరంగ సభల నిర్వహణ, బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు రూపొందించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. మనుధర్మాన్ని తీసుకొచ్చే కుట్రలో భాగంగానే పాఠ్యంశాల్లో డార్విన్ సిద్ధాంతం వంటి అంశాలు, చరిత్రను తొలగిస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఓట్ల రాజకీయాల కోసం శ్రీరాముడు, హిందూమతాన్ని బీజేపీ అడ్డుపెట్టుకున్నదని, ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధాని మోదీ ‘ జై బజరంగ్ బలి’ అని చెప్పి ఓట్లు పొందేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 15న హుస్నాబాద్లో, జూన్ 4న కొత్తగూడెంలో సీపీఐ ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్టు వివరించారు. అటు.. మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడటం దేశానికే అవమానకరం అని కూనంనేని మండిపడ్డారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ది కేరళ స్టోరీ సినిమా విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా విమర్శించారు. గతంలో గుజరాత్ గురించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, అదే సమయంలో కేరళ స్టోరీని ప్రదర్శించాలని, పన్ను రద్దు చేయాలని కోరడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, వీఎస్ బోస్, టీ శ్రీనివాస్రావు, కలవేణి శంకర్, ఎన్ బలమల్లేశ్, ఎం బాలనరసింహ, ఈటీ నరసింహ, బీ హేమంత్రావు పాల్గొన్నారు.