హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పంటలకు కత్తెర పురుగు ముప్పు పొంచి ఉన్నదని అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటికీ ఈ పురుగు ఇండియాతోపాటు 70 దేశాల్లో వ్యాప్తి చెందినట్టు పేర్కొన్నది. 80 రకాల పంటలపై దాడి చేసి నష్టం చేస్తుందని తెలిపింది. కత్తెర పురుగు వల్ల ముఖ్యంగా మక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనున్నది. కొంత మేరకు వరిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. 2018-19లో మన దేశంలో అన్ని రాష్ర్టాల్లోనూ ఈ పురుగు వ్యాపించి మక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలను కనుగొన్నారు. మళ్లీ ఇప్పుడు ఈ పురుగు వ్యాపించే అవకాశం ఉన్నదని ఎఫ్ఏవో హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ఈ పురుగు తెలంగాణ వరకు రాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వ్యవసాయ వర్సిటీ పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు. ఈ పురుగు నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తామని వివరించారు. కత్తెర పురుగు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే ఏఈవోలకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.