ములుగు: ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఎన్కౌంటర్పై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35)తోపాటు అతని దళ సభ్యులు మృతిచెందారు. మృతిచెందినవారిలో ఏటూరునాగారం మహదేశ్పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. 14 ఏండ్ల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం విశేషం.
Mulugu