హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్-2021లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. ఏకంగా ఏడుగురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. వీరిలో మధుర్ ఆదర్శ్రెడ్డి, కొమ్మ శరణ్య జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సొంతం చేసుకొన్నారు. వీరితోపాటు జాతీయస్థాయిలో నల్లగొండకు చెందిన చల్లా విశ్వనాథ్ 26, సూర్యాపేట జిల్లా నడిగూడానికి చెందిన బుస్సా సాయి 36వ ర్యాంకు సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన నితిన్ ఎస్టీ క్యాటగిరీలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జాతీయస్థాయిలో ఏకం గా 18 మంది ఫస్ట్ ర్యాంకు సాధించటం విశేషం. నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలను క్రోడీకరించి బీఈ/బీటెక్ పేపర్-1 తుది ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. ఈ పరీక్షల్లో జాతీయస్థాయిలో ఏకంగా 44 మంది వంద పర్సంటైల్ సాధించారు. గతేడాది జేఈ ఈ మెయిన్లో 24 మంది 100 పర్సంటైల్ సాధించారు. బుధవారం నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. వచ్చేనెల 3న ఈ పరీక్ష దేశవ్యాప్తంగా జరుగనున్నది. అడ్వాన్స్డ్ను ఐఐటీ ఖరగ్పూర్ ని ర్వహించనున్నది. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా, 21 వరకు ఫీజుచెల్లించేందుకు వీలున్నది.
జేఈఈ మెయిన్ ర్యాంకుల కేటాయింపులో ఈసారి వయసుకు బదులుగా సబ్జెక్టు ప్రాధాన్యతను పరిగణించారు. మార్కులు సమానంగా వచ్చిన విద్యార్థులకు టైబ్రేకర్ విధానంలో ర్యాంకులిచ్చారు. గణితానికి మొదటి ప్రాధాన్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ఆ తర్వాతి స్థానం నిర్ణయించారు. గణి తం విభాగంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మెరుగైన ర్యాంకు దక్కింది.
జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో ఎన్టీఏ వైఖరి విద్యార్థులను తీవ్ర అసహనానికి గురిచేసింది. అర్ధరాత్రి తర్వాత ఫలితాలు ప్రకటించటతో విద్యార్థులంతా నిద్ర మాని ఎదురుచూశారు. అందరూ ఒక్కసారే వెబ్సైట్లోకి వెళ్లటంతో ఒత్తిడికి అది కొన్ని గంటలపాటు క్రాష్ అయింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ కోసం వివిధ క్యాటగిరీల కటాఫ్ స్కోరును ఐఐటీ ఖరగ్పూర్ ప్రకటించింది. ఓపెన్ కోటాలో 87.89, ఈడబ్ల్యూఎస్లో 66.22, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్)లకు 68.02, ఎస్సీలకు 46.88, ఎస్టీలకు 34.67, పీహెచ్ అన్రిజర్వుడ్ వారికి 0.0096 స్కోరును కనీస కటాఫ్గా నిర్ణయించారు. గతేడాది ఓపెన్ కటాఫ్90.37తో పోల్చితే ఈసారి కొంచం తగ్గింది.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో పలువురు బీసీ గురుకులాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. లలితాదిత్య 97, రమ్య అనే విద్యార్థి 82 పర్సంటైల్ సాధించారు. మొత్తంగా 70 మంది పరీక్షలకు హాజరుకాగా, 34 మంది అర్హత సాధించారు. వీరిని మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య భట్టు, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అభినందించారు.
రోజుకు 10 గంటలు కష్టపడ్డా
జేఈఈ మెయిన్స్ నాలుగుసార్లు రాశా. రెండుసార్లు 100 పర్సంటైల్ వచ్చింది. నన్ను నేను మెరుగుపరుచుకొనేందుకు రోజుకు 8-10 గంటలు కష్టపడ్డా. అడ్వాన్స్డ్లో మంచి ర్యాం క్ సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్సైన్స్లో చేరాలనుకుంటున్నా. సాఫ్ట్వేర్లో ఉన్నతస్థాయికి చేరడమే లక్ష్యం.
– మధుర్ ఆదర్శ్రెడ్డి
పొరపాట్లు సవరించుకొంటూ ప్రిపేరయ్యా
జేఈఈ మెయిన్స్ నాలుగు సెషన్లు రాస్తే రెండుసార్లు 100 పర్సంటైల్ వచ్చింది. మూడో సెషన్లో 100 పర్సంటైల్ వచ్చి నా, కెమిస్ట్రీలో మంచి మార్కులు రాకపోవడంతో నాలుగో సెషన్ రాశాను. మళ్లీ 100 పర్సంటైల్ సాధించాను. వెబ్సైట్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూ, మార్కులు, ర్యాంకులను చూ సుకుంటూ తప్పులను సవరించుకుంటూ ముందుకెళ్లా.
– పోలు లక్ష్మీసాయి లోకేశ్రెడ్డి
నా కష్టానికి ఫలితం దక్కింది
100 పర్సంటైల్ సాధించడం చాలా సంతోషంగా ఉన్నది. ఫలితాలు చూడగానే నా కష్టానికి ఫలితం దక్కింది అనిపించింది. జేఈఈ అడ్వాన్స్డ్ కోసం బాగా ప్రిపేరవుతున్నా. బాంబే ఐఐటీతో సీఎస్ఈలో చేరి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతా.
– బన్నూరు రోహిత్కుమార్రెడ్డి
అసక్తితో అహోరాత్రులు కష్టపడ్డా
జేఈఈ మెయిన్ నాలుగుసార్లు రాశా. మూడుసార్లు స్వల్పతేడాతో 100 పర్సంటైల్ కోల్పోయా. ఎట్టకేలకు 100 పర్సంటైల్ సాధించగలిగా. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లోనే చేరతా. ఐఐటీలో చేరడం కోసమే అహోరాత్రులు కష్టపడ్డా. – కొమ్మ శరణ్య
బిల్గేట్స్లా అవ్వాలని కష్టపడ్డాను
జేఈఈ మెయిన్ నాలుగుసార్లు రాస్తే రెండుసార్లు 100 పర్సంటైల్ వచ్చింది. మంచి ర్యాంకు కోసం రోజుకు 10-11 గంటలు కష్టపడి చదివిన. నాకు ఐఐటీ బాంబేలో కంప్యూటర్సైన్స్ చేరాలని ఉన్నది. సత్యనాదెళ్ల, బిల్గేట్స్లా అవ్వాలని కష్టపడ్డాను. – జ్యోసుల వెంకట ఆదిత్య
100 పర్సంటైల్ వస్తుందనుకోలేదు
గతంలో మూడుసార్లు జేఈఈ మెయిన్ రాసినా ఎప్పుడూ 100 పర్సంటైల్ రాలేదు. నాలుగోసారి రాసినా వస్తుందన్న అశలు లేకుండే. కానీ 100 పర్సంటైల్ సాధించగలిగా. ప్రస్తుతానికి నా దృష్టంతా జేఈఈ అడ్వాన్స్డ్పైనే. నేను ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా. – కటికెల పునీత్కుమార్