హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది 3,08,670 మహిళా సంఘాల సాధికారత కోసం రూ.15 వేల 37 కోట్ల బ్యాంకు లింకేజీ సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్దేశించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ప్రణాళికలు రూపొందించుకొని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం మారిగోల్డ్ హోటల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) 2023-24 వార్షిక రుణ ప్రణాళికను సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ సీజీఎం సుశీల చింతల, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ చైర్మన్ అమిత్ జింగారాంజీ, రిజర్వుబ్యాంక్ ప్రతినిధి అనిల్ కుమార్రెడ్డితో కలిసి మంత్రి దయాకర్రావు ఆవిషరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలకు పెద్దఎత్తున అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో 21 వేల కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందించగా, రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి 68, 522 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు అందించినట్టు పేర్కొన్నారు. రుణాలు సకాలంలో చెల్లిస్తున్నందున మహిళా సంఘాలపై బ్యాంకర్లకు ఎంతో నమ్మకం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 2,910 కోట్లు వడ్డీలేని రుణాలను విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
టాప్ 5లో ఉన్నాం
మహిళాసంఘాల పనితీరు, బ్యాంకు రుణాలు, ఇతర అన్ని అంశాల్లో కలిపి తెలంగాణ దేశంలోనే టాప్-5లో ఉన్నదని సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. మహిళా సంఘాల రుణాల విషయంలో సర్వీస్ చార్జీలు ఉండరాదని, బ్యాంకులు వడ్డీరేట్లలో తేడా ఉండకుండా చూడాలని సూచించారు. నాబార్డు సీజీఎం సుశీలచింతల మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలకు 54% రుణ సౌకర్యం అందించగా తెలంగాణలోని 76% మహిళలకు రుణ సౌకర్యం లభిస్తున్నదని తెలిపారు. ఎస్ఎల్బీసీ చైర్మన్ అమిత్ జింగారాంజీ మాట్లాడుతూ, ఆదాయ మార్గాలను గుర్తించి రుణాలు ఇవ్వటం ద్వారా పేదరిక నిర్మూలన నూరు శాతం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్పీఏ 1.66% ఉండటంపై అభినందనలు తెలిపారు.