హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): స్టార్ట్ఆప్ విలేజ్ అంత్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ (ఎస్వీఈపీ) కార్యక్రమం రాష్ట్రమంతటా విస్తరింపజేయనున్నారు. ఇప్పటివరకు 19 జిల్లాలకే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని మిగిలిన 13 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్లను తయారుచేసి పంపించాల్సిందిగా ఆయా జిల్లాల డీఆర్డీవోలను సెర్ప్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్వీఈపీ కింద ఔత్సాహిక మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవసరమైన రుణాన్ని ఇప్పించనున్నారు. లబ్ధిదారు కుటుంబంతోపాటు మరికొందరికి ఉపాధి లభించేలా ఈ ప్రోగ్రాంను రూపొందించారు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభించిన ఎస్వీఈపీ పథకాన్ని 2016 నుంచి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
గ్రామీణ మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నది. ఈ పథకం ద్వారా కనీసం రూ. 1.50 లక్షలతో వ్యాపారం చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికచేసే వారిలో 70 శాతానికి పైగా కొత్తవారు ఉండాలి. మిగిలిన 30 శాతం మంది ఇప్పటికే ఉన్న వివిధ రంగాలకు చెందినవారు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అనుమతిస్తారు. వ్యాపారం చేసే వారికి ఇప్పటికే సంపాదిస్తున్న ఆదాయానికి తోడుగా అదనంగా సంవత్సరానికి కనీసం రూ. 60 వేల ఆదాయాన్ని సంపాదించాల్సి ఉంటుంది. అంటే నెలకు కనీసం రూ. 5 వేలను ఆదనంగా ఆదాయాన్ని సంపాదించాలి.
ఐదో దశలో 13 జిల్లాలు
దశల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మూడు దశల్లో 8,071 యూనిట్లను లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటికే 8,853 యూనిట్లను ఎంపిక చేసి లక్ష్యాన్ని దాటారు. నాలుగో దశకు సంబంధించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించారు. ఐదో దశలో మిగిలిన అన్ని జిల్లాలను పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలు కొత్తగా చేరాయి. ఈ జిల్లాలకు సంబంధించిన ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలను పంపించాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అధికారులు ఆదేశించారు.