హైదరాబాద్ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, అదేవిధంగా సెర్ప్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో బుధవారం సెర్ప్ ఉద్యోగులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం సంఘాల బాధ్యులు, ఉద్యోగులు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో రూ. 3 వేల 780 కోట్ల వ్యయం చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టి 28 లక్షల కుటుంబాలకు చెందిన 48 లక్షల మంది కూలీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పని కల్పించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 14 కోట్ల 64 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 14 కోట్ల 9 లక్షల పనిదినాలను కల్పించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంతో అధికారులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో పని చేసి ఉపాధి హామీ పథకాన్ని అగ్రభాగాన నిలపాలన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూడు లక్షల పదివేల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 11 వేల 750 కోట్లు బ్యాంకు లింకేజీ సెర్ప్ ద్వారా కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు గత ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 55 వేల 913 కోట్ల బ్యాంకు లింకేజీ ని గ్రామీణ ప్రాంతాలలోని మహిళ స్వయం సహాయక సంఘాలకు కల్పించామని ఆయన చెప్పారు. అధికారులు, సెర్ప్, ఉద్యోగుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులకు సహాయం అందించి తద్వారా ఉపాధి కల్పించడానికి సెర్ప్ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేయాలని దయాకర్ రావు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీవోల సంఘం అధ్యక్షుడు మోహన్ రావు, అంజిరెడ్డి, నాగభూషణం, ఈసీల సంఘం అధ్యక్షుడు లింగయ్య, రాజశేఖర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్స్ సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్, రఘు, రఫీ, టీఏల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మాధవ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ల సంఘం అధ్యక్షుడు రవి, మొగిలి, అటెండర్ ల సంఘం అధ్యక్షులు అనంతయ్య, భిక్షపతి, స్వప్న, సెర్ప్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగిరెడ్డి, అశోక్, రాజేందర్ పాల్గొన్నారు.