నల్లగొండ : రాష్ట్రంలో బీజేపీని నియత్రించకపోతే భవిష్యత్లో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండలో సీపీఎం జిల్లా 20వ మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మోదీ సర్కారు ప్రజలను దోచుకుంటున్నదని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా ప్రయివేటికరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగం, రైతాంగం, కార్మికుల విషయంలో, కోవిడ్ ను ఎదుర్కోవడంలో ప్రధానిగా మోదీ విఫలమయ్యారన్నారు. మోదీ గ్రాఫ్ ఘోరంగా పడిపోతున్నదని వీరభద్రం పేర్కొన్నారు. బీజేపీ మత విభజనకు దారితీసే సీఏఏ చట్టాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే కుట్ర జరుగుతోందన్నారు.
NPR, NRC, CAA మూడు వేర్వేరుగా కనిపిస్తున్నా అంతర్గతంగా లింక్ ఉందన్నారు. దేశంలో కేవలం 21 శాతం మందికే రెండు డోసుల వాక్సిన్ అందిందన్నారు. దేశంలో కొద్ది మందికే ఉచిత వాక్సిన్ అందుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ మోదీపైన పోరాటాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తమ మద్దతు కూడా తెలుపుతామన్నారు.