KTR | సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని, పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భారత సమాఖ్యలో విలీనమైన 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న కేటీఆర్, ఆ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ నగరంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారని, ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాలలో నిర్వహించే సంబరాలకు మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారన్నారు. దీంతోపాటు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్నమైన కార్యక్రమాలతో అభివృద్ధిలో అగ్రగామిగా కేటీఆర్ అన్నారు. అయితే, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవంపై కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజని, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందన్నారు.
జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయన్నారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించి.. తెలంగాణ జీవనాడిని కలుషితం చేయాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.