హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) గురువారం తెల్లవారుజామున వరంగల్లులో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కె.ఎల్.రెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1950లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కె.ఎల్.రెడ్డి సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమంలో “నేడు” పేరుతో మూడు నెలలపాటు ఒక కరపత్రాన్ని వెలువరించారు. తెలంగాణ ఉద్యమ వార్తలను ఇందులో ప్రముఖంగా ప్రచురించేవారు. అయితే వార్తాపత్రికల రిజిస్ట్రార్ అనుమతి లేకుండా పత్రిక స్థాయిలో “నేడు”ను వెలువరించడం నేరంగా పరిగణించి ఆయనకు నెల రోజులపాటు కఠిన కారగార శిక్ష విధించారు. తెలంగాణ అక్షర యోధుడు పేరిట కె.ఎల్. రెడ్డి గురించి గోవిందరాజు చక్రధర్ ఆంధ్రభూమిలో రాసిన ప్రత్యేక కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తన సహాయనిధి నుంచి రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కెఎల్ రెడ్డి ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ పలు పత్రికల్లో పని చేశారు. కె.ఎల్. రెడ్డి మరణం పట్ల ప్రముఖ సంపాదకులు ఎం.విఆర్. శాస్త్రి, సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ మాడభూషి శ్రీధర్, గోవిందరాజు చక్రధర్, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు, ఉపాధ్యక్షులు ఉడయవర్లు, కార్యదర్శి కొండా లక్ష్మణరావు తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం
సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కె.ఎల్.రెడ్డి, జర్నలిస్టుగా ఎక్కువ కాలం వరంగల్ లోనే గడిపారన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను, అతనితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.