హైదరాబాద్: విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా (Yogita Rana) నియమితులయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రాణా.. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్న బుర్రా వెంకటేశంను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. దీంతో ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా యోగితా రాణాను సెక్రెటరీగా నియమించడంతో శ్రీధర్ను ఆ బాధ్యతల నుంచి విద్యాశాఖ రిలీవ్ చేసింది.
కాగా, ఎన్. శ్రీధర్కు గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా 2006 బ్యాచ్కు చెందిన కే. సురేంద్ర మోహన్ను రవాణా శాఖ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.
యోగితా రాణా.. 2003 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. 2002లో సివిల్ సర్వీసెస్లో మూడో ప్రయత్నంలో ఐఆర్టీఎస్కు ఎంపికయ్యారు. 2003లో సివిల్స్లో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో విశాఖ జిల్లాలో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్గా, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేశారు. ఆ తర్వాత యూఎన్డీపీలో మూడున్నరేండ్లు బాధ్యతలు నిర్వహించారు. 2017లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ‘ఈ-నామ్’ అమలులో జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.