Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షీనటరాజన్ మీద తెలంగాణలో కేసుల గురించి టీ కాంగ్రెస్ నేతలే తమకు సమాచారం ఇచ్చారని బాంబు పేల్చారు.
మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘అసలు మీనాక్షీనటరాజన్ మీద తెలంగాణలో కేసు నమోదైనట్టు మాకు తెలియనే తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ నుంచే ఆ సమాచారం మాకు వచ్చింది. అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలే మాకు ఈ సమాచారం ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడి నుంచే మాకు ఈ కేసు పత్రాలొచ్చాయి. దీనిని బట్టి కాంగ్రెస్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’ అని వ్యాఖ్యానించారు.
మొత్తంగా కైలాష్ విజయ్ వర్గియా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో పెను ప్రకంపనలకు దారితీశాయి. మీనాక్షికి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా కొందరు టీ కాంగ్రెస్ నేతలు కోవర్ట్ రాజకీయాలు నడుపుతున్నారని ఇప్పటికే కొన్ని వార్తలొచ్చాయి. కైలాష్ వర్గియా వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.