సుల్తాన్ బజార్, జూన్ 4: పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు లంచం తీసుకొంటూ నాంపల్లిలోని పెన్షన్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డాడు. రల్లి వెంకట సత్యనాగ ప్రసాద్ నాంపల్లిలోని అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ ఆఫీసర్ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ఆయేషా సిద్ధిఖి తల్లిండ్రులు వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్లు. వారి మరణానంతరం వచ్చే బెన్ఫిట్స్ కోసం ఆయేషా గత ఏడాది పెన్షన్ పేమెంట్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకొన్నారు. ఆ దరఖాస్తును పరిశీలించాలంటే రూ.27 వేలు లంచం ఇవ్వాలని సత్యనాగ ప్రసాద్ డిమాండ్ చేయటంతో తొలి విడతలో రూ.10 వేలు ఇచ్చారు. మిగతా లంచం కోసం ఆయన ఒత్తిడి తేవటంతో ఆమె ఏసీబీకి ఫిర్యాదు చేశారు. శనివారం ఆయేషా రూ.10 వేలు ఇస్తుండగా ప్రసాద్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే 1054కు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రసాద్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.