హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.7 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయని, ఇవి రెండు రోజులకు కూడా సరిపోవని తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్కు తగినట్టుగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడినవారికి మొదటి డోస్ పంపిణీ 106%, రెండో డోస్ 104% పూర్తయిందని వివరించారు. ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రికాషన్ (బూస్టర్) డోస్ పంపిణీని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వైద్యశాఖకు రోజుకు 3 లక్షల టీకాలు వేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, తగినన్ని నిల్వలు లేకపోవడంతో రోజుకు సగటున 1.5 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.