JNTU | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు కళాశాలల్లో ఫేక్ ఫ్యాకల్టీకి చెక్ పెట్టేందుకు జేఎన్టీయూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. 2023 -24 విద్యాసంవత్సరానికి ఫ్యాకల్టీ సెలెక్షన్స్కు జేఎన్టీయూ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ మినట్స్ (ఎస్ఈఎం) షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 9 నుంచి 17 వరకు కాలేజీలవారీగా షెడ్యూల్ను ప్రకటించింది. ఆ మేరకు అధ్యాపకులు ఎస్ఈఎంలకు హాజరుకావాలని జేఎన్టీయూ అధికారులు సూచించారు. ఒక్కో రోజు 10 నుంచి 23 కాలేజీల అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకోవాల్సి ఉన్నది.
కానీ, పలు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మరో కాలేజీలో చేరడంతోపాటు, కొందరు ఉద్యోగాల నుంచి వైదొలగగా, వారి స్థానంలో కాలేజీలు కొత్త వారిని నియమించుకున్నాయి. ఫ్యాకల్టీ సెలెక్షన్స్ను పూర్తిచేసిన కాలేజీలు ఇటీవలే వివరాలను జేఎన్టీయూకు సమర్పించాయి. ఫ్యాకల్టీని కాలేజీలు నియమించుకుంటే సరిపోదు. వాటికి జేఎన్టీయూ ఎస్ఈఎం ఆమోదం తెలిపాల్సి ఉన్నది. ఫ్యాకల్టీ సమర్పించిన బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లను పరిశీలించి, ఇంటర్వ్యూ చేసి, అంతా సవ్యంగా ఉంటే నియామకానికి ఒకే చెప్తారు.