హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఇండియా బ్లాక్చెయిన్ యాక్సిలరేటర్ తన తొలి మెంటార్షిప్, ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం 14 వెబ్-3 స్టార్టప్లను ఎంపిక చేసింది. తెలంగాణ ప్రభుత్వం, క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్ ‘కాయిన్ స్విచ్’, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ సంస్థ లూమోస్ ల్యాబ్స్ సంయుక్తంగా 2021లో ప్రారంభించిన ఈ యాక్సిలరేటర్కు దాదాపు రూ.5.2 కోట్ల (7 లక్షల అమెరికన్ డాలర్ల) గ్రాంట్ను సమకూర్చారు. తుది మూల్యాంకన రౌండ్లో అత్యుత్తమ రేటింగ్ ఉన్న 5 స్టార్టప్లను ఎంపికచేసి తెలంగాణ ప్రభుత్వం, కాయిన్ స్విచ్తోపాటు ఇతర పెట్టుబడి భాగస్వాములతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో బ్లాక్చెయిన్ టెక్నాలజీ స్టార్టప్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. ప్రపంచ బ్లాక్చెయిన్ రాజధానిగా మారాలన్న తెలంగాణ లక్ష్యానికి మద్దతివ్వడాన్ని గౌరవంగా భావిస్తామని కాయిన్ స్విచ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఆశిష్ సింఘాల్ తెలిపారు.