హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలును పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పలుచోట్ల ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాలు, తేమ పేరుతో అధిక మొత్తంలో తరుగు తీయడం, కొనుగోలు కేంద్రం కాంటా పూర్తైన ధాన్యంలో తూకం తక్కువ వచ్చిందంటూ మళ్లీ కోత పెట్టడం వంటి ఘటనలు పౌరసరఫరాల సంస్థ దృష్టికి వచ్చాయి. వీటిపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, అటు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగానే కలెక్టర్లకు, జిల్లా పౌరసరఫరాల అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రతి కేంద్రంలోనూ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా తూకంను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒకసారి తూకం పూర్తయ్యాక మళ్లీ కోత పెట్టడం వంటి వాటిని నిలువరించాలని ఆదేశించారు. ప్రతి రైతు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన వివరాలను పక్కాగా షీట్లో నమోదుచేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఎంతమంది రైతులు, ఎంత మొత్తం ధాన్యం విక్రయించారో వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీల కోసం ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కూడా రంగంలోకి దించారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,722 కొనుగోలు కేంద్రాల్లో 9లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.