Seetha Rama Project | భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల్లో పట్టుకోసం ఉన్నట్టుండి బీజేపీ కొత్త రాగం ఎత్తుకున్నది. ఎన్నికల్లో తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను సమిధ చేయాలని చూస్తున్నది. నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర పన్నుతున్నది. ఇందుకు తెలంగాణను బలిపెట్టాలని చూస్తున్నది. ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణ నీటి ప్రాజెక్టులకు నీళ్లు అందవు. ము ఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ చేపట్టిన సీతమ్మ బరా జ్, సీతారామ ప్రాజెక్టులపై దీని ప్రభావం పడుతుంది.
సీతమ్మ బరాజ్కు నీళ్లు ఎలా?
ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించుకుపోతే దాని దిగువన ఉన్న సీతమ్మ బరాజ్, సీతారామ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇచ్చంపల్లిలో ప్రస్తుతం 87 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్ వద్ద 15.88 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. బరాజ్ ఎత్తు పెంచితే 30 నుంచి 40 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. అక్కడి నుంచి నీటిని ఆయా మార్గాల ద్వారా తమిళనాడుకు తరలించి కావేరీ నదికి అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తున్నది.
అదే జరిగితే, ఇచ్చంపల్లి దిగువన ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతమ్మ బరాజ్, సీతారామ ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉన్నదని ఇరిగేషన్ నిపుణులు చెప్తున్నారు. ఇక, గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చంపల్లి నుంచి దిగువకు నీళ్లు రాకపోతే పోలవరం బ్యాక్ వాటర్ ఉండదని, ముంపు ప్రాంతాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముంపు ప్రజలను ఖాళీ చేయించటం లో అంతరార్థం ఏమిటని నిలదీస్తున్నారు.
ఇచ్చంపల్లి ఎత్తు పెంచితే సీతమ్మ బరాజ్కు నీళ్లెట్ల?
ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు పెం చితే సీతమ్మసాగర్కు నీళ్లు రావడం కష్టమవుతుంది. కేసీఆర్ ఆశయాన్ని ముక్కలు చేసినట్టు అవుతుంది. నేడు గోదావరి జలాలు రైతులకు అందుతున్నాయంటే అది ఆయన పుణ్యమే. నీళ్ల కోసం కొట్లాడిన కేసీఆర్.. గోదావరిపై అనేక బరాజ్లు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. ఇప్పుడు బీజేపీ తన స్వార్థ రాజకీయాలకు తెలంగాణ నీళ్లను తమిళనాడుకు తీసుకెళ్తానంటున్నది. ఈ కుట్రను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే
బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణలో నీళ్ల పేరుతో మంటలు పెడుతున్నది. జాతీయ ప్రయోజనాల కోసం ఏవైనా ప్రాజెక్టులు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా అఖిలపక్షంతో చర్చించాలి కదా? ఇచ్చంపల్లి విషయంలో అలా లేదు. దక్షిణాదిలో పట్టుకోసం బీజేపీ కుట్రలు చేస్తున్నది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నది. కొన్ని ప్రాంతాల అవసరాల కోసం ఇతరులను బలిచేయటం సమంజసం కాదు.
-బండారు రవికుమార్. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, కొత్తగూడెం
రాష్ర్టాల సత్సంబంధాలను దెబ్బతీసేందుకే
రాష్ర్టాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీసేందుకు, తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకే కేంద్రంలోని బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తున్నది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించుకుపోతే.. దిగువన ఉన్న భద్రాద్రి జిల్లా రైతులు, ప్రజల పరిస్థితి ఏమిటి? జిల్లాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. గోదావరి జలాలను తమిళనాడుకు తీసుకెళ్లేందుకు భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బరాజ్ వంటి సాగునీటి వనరులను బలిచేస్తామంటే ఊరుకొనే ప్రసక్తే లేదు.
-ఎస్కే సాబీర్పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి, కొత్తగూడెం
రాష్ర్టాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నది
దక్షిణాదిన పట్టు పెంచుకోవటం కోసం ఇక్కడి రాష్ర్టాల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తున్నది. అందుకే నదుల అనుసంధానం, గోదావరి జలాల తరలింపు వంటి అంశాలతో కొత్త రాగం ఎత్తుకున్నది. ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు మళ్లీ పెంచితే అక్కడి ప్రాంతాలన్నీ జలమయమవుతాయి. దిగువకు నీరు రావటం కష్టమవుతుంది. భద్రాద్రి జిల్లాకు నష్టం చేయాలని చూస్తే ఇక్కడి ప్రజలు తిప్పికొడతారు.
-నాగా సీతారాములు, ఏఐసీసీ సభ్యుడు, కొత్తగూడెం